Reading Time: 2 minutes
Bapatla Software Engineer Divya Mother Suicide Groom Character Allegations

Mother Daughter Suicide: పెళ్లి కాకముందే.. యువతిని అనుమానించాడు.. నీ ప్రవర్తన సరిగా లేదంటూ నిందలు వేశాడు.. వరుడు చేసిన ఈ పనికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. అపవాదు… అవమానం భరించలేక తల్లీకూతుళ్లు సూసైడ్ చేసుకున్నారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు కేకలు వినిపించాయి. ఆనందాలు నిండాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన బాపట్ల జిల్లా ద్రోణాదులలో జరిగింది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో తల్లీకూతుళ్లు ఒకేసారి బలవన్మరణానికి పాల్పడ్డారు. వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం. వివాహం కుదుర్చుకుని ఎంగేజ్ మెంట్ సైతం చేసుకున్న వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన తల్లి కూతుర్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

READ ALSO: Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

ద్రోణాదులలోని బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె దివ్య హైదరాబాద్‌లో గత మూడు సంవత్సరాలుగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇటీవలే మార్టూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించారు. అందుకోసం గతేడాది డిసెంబర్ 14న ఎంగేజ్‌మెంట్ కూడా ఘనంగా జరిపించారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మార్చి 4న శేషుబాబు దివ్యను ఆమె తల్లిదండ్రులను మాట్లాడాలంటూ మార్టూరులోని తమ నివాసానికి పిలిపించాడు. ఈ సందర్భంగా శేషుబాబు తాను హైదరాబాద్‌లో దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఆ కుటుంబానికి చూపించాడు. దివ్య.. క్యారెక్టర్ మంచిది కాదని పెళ్లికి నిరాకరిస్తున్నట్లు తేల్చి చెప్పాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు దివ్య, ఆమె పేరెంట్స్.

ఈ సంఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి కుమార్తెలు శ్రీనివాసరావుకు తెలియకుండా మార్టూరులోనే ఎలుకల మందుతో పాటు గడ్డి మందు కొనుగోలు చేసి ద్రోణాదుల వచ్చారు. ఇద్దరూ తాగి పడుకున్నారు. మరుసటి రోజు… సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న దివ్య, సుజాతను గమనించిన శ్రీనివాసరావు మొదట చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులలో విడివిడిగా చికిత్స నిమిత్తం చేర్పించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ సుజాత, దివ్య ఇద్దరూ మృత్యువుతో పోరాడారు. మార్చి 12న ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దివ్య మృతి చెందగా.. 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత కూడా ఆసుపత్రిలోనే మరణించింది. సుజాత భర్త శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, ఫోటోలు-వీడియోల అంశం, పెళ్లి రద్దు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారించి నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలా విషాదం నెలకొనడం అందరినీ కలచివేసింది.

READ ALSO: Vijay TVK: తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ గూటికి దళపతి విజయ్?