Reading Time: < 1 minute
West Bengal Yuva Sarathi Scheme Unemployment Allowance Details

వెస్ట్ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. పది పాసై ఎలాంటి ఉద్యోగం చేయని నిరుద్యోగులకు రూ.1500 నిరుద్యోగ భృతి ప్రకటించారు. నేటి నుంచే నిరుద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. అయితే ఈ నిరుద్యోగ భృతి వర్తించాలంటే ఆ వ్యక్తి వయస్సు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. యువ సారథి అనే స్కీమ్ ద్వారా ఈ భృతి అందించడం జరుగుతుందన్నారు.

Also Read:Mutual Funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు భారీ శుభవార్త.. కొత్త రూల్ తీసుకొచ్చిన సెబీ..

యువ సారథి పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని మొదట భావించగా.. మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తేదీల్లో మార్పు చేసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తుండగా.. కోల్‌కతాలో చేపట్టిన ధర్నాలో మమతా బెనర్జీ పాల్గొని ఈ ప్రకటన చేశారు.

అయితే బెంగాల్‌లో 40 శాతం మేర నిరుద్యోగిత రేటు తగ్గిందని.. 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించామని.. వారిలో 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించిందని.. అన్ని రంగాల వారిని కలుపుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వెస్ట్ బెంగాల్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.