
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భివాండిలో ఓ భవనానికి మరమ్మత్తులుచేస్తుండగా ఈ రోజు ( జులై 31) న కూలింది . ఈ ఘటనలో ఆరుగురు మరణించారని సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
నిజాంపూర్ సిటి పరిధిలోని ఈ భవనాన్ని ముందే మున్సిపల్ అధికారులు గుర్తించారు. పట్టించుకోకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో భవనం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. సుమారు 14 నుంచి 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని మున్సిపల్ అధికారులు ఇప్పటికే ప్రమాదకర భవనంగా గుర్తించి నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎక్కువ మంది నివాసితులను ముందుగానే ఖాళీ చేయించినప్పటికీ, భవనంలో మరమ్మతు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకేసారి మూడు స్తంభాలను తొలగించడం వల్ల భవనం కూలిపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు .
ఎన్డీఆర్ఎఫ్ , టీడీఆర్ఎఫ్ , అగ్నిమాపక శాఖ, పోలీసులు, భివండి-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకురాగా, వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. అయితే శిథిలాల నుంచి మూడు మృతదేహాలను కూడా వెలికితీశారు. ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.