ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!

ZIM vs IND: వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లను గెలిచిన తర్వాత ఆడిన రెండు సిరీస్ల్లోనూ వైట్వాష్ ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు కొత్త ఉత్సాహం లభించింది. అలాగే భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఏడు మ్యాచ్ల తర్వాత తొలి విజయం దక్కింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారత బౌలర్లు ప్రారంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థి జట్టు టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. బ్రయాన్ బెనెట్ (0), బెన్ కర్రాన్ (10), డియోన్ మైయర్స్ (6), కెప్టెన్ సికిందర్ రజా (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో జింబాబ్వే 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత వెస్లీ మద్వీర (39), మరుమాని (27 నాటౌట్), ర్యాన్ బర్ల్ (26) పోరాడి జట్టు స్కోరును 125 పరుగులకు చేర్చారు. ముఖ్యంగా మద్వీర-మరుమాని జోడీ ఆరో వికెట్కు 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, శివమ్ దూబె, రవి బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అనంతరం ఇషాన్ కిషన్ 35 పరుగులతో, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో రెండు వికెట్లు పడగొట్టిన మయాంక్ యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 మ్యాచ్ శనివారం జరగనుంది.