Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 2026 నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నీట్-యూజీ 2024 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నిందితుడిగా పేర్కొనబడిన సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియాకు తాజాగా సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిణామంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఈ కేసులో అసలు సూత్రధారిని మోడీ ప్రభుత్వం కాపాడిందని ఆరోపించారు.
మోడీ అసలు నిజం బయటపడింది
కేజ్రీవాల్ తన పోస్టులో.. ‘‘ఇదిగో మోడీ అసలు నిజం బయటపడింది.’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘2024లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఆ కేసులో సూత్రధారిని మోడీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ కావాలనే సీబీఐ నిర్దిష్ట గడువులోగా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. దీంతో కేవలం మూడు నెలల్లోనే అతనికి ఆటోమేటిక్ బెయిల్ లభించింది.’’ అని పేర్కొన్నారు. తదుపరి.. ‘‘ఇప్పుడు అదే వ్యక్తికి సీబీఐ ద్వారా క్లీన్ చిట్ ఇప్పించారు. వాహ్ మోడీజీ.. వాహ్. కానీ మీ ఉద్దేశాల్లో లోపం ఉంది. దీని నుంచి మీరు తప్పించుకోలేరు.’’ అంటూ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.
సీబీఐ ఏమంది?
కేజ్రీవాల్ వ్యాఖ్యల అనంతరం సీబీఐ తన దర్యాప్తు వివరాలను వెల్లడించింది. సీబీఐ ప్రకారం.. 2024లో జరిగిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం దొంగతనాన్ని తొలుత బిహార్ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఆ సమయంలో సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియాపై అనుమానం వ్యక్తమైంది. గతంలో ఇతర ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో కూడా అతని పేరు రావడంతో ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చారు. తర్వాత కేసు సీబీఐకి బదిలీ కావడంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రశ్నాపత్రం దొంగతనం, పంపిణీ, లబ్ధిదారులు సహా మొత్తం కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 45 మందిపై పాట్నా కోర్టులో పలు ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. అయితే సమగ్ర దర్యాప్తులో సంజీవ్ ముఖియా నీట్-యూజీ 2024 ప్రశ్నాపత్రం దొంగతనం లేదా పంపిణీలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ స్పష్టం చేసింది. ‘‘సమగ్రంగా దర్యాప్తు నిర్వహించిన తర్వాత మొత్తం కుట్రను ఛేదించాం. ఇందులో పాల్గొన్న వారందరినీ గుర్తించాం. అయితే సంజీవ్ ముఖియా ప్రమేయాన్ని నిరూపించే ఎలాంటి ఆధారాలు దొరకలేదు.’’ అని సీబీఐ తెలిపింది.
సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం.. దర్యాప్తు సమయంలో సంజీవ్ ముఖియా పరారీలో ఉండగా తర్వాత బీహార్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉండటంతో సీబీఐ కూడా కస్టడీలోకి తీసుకుని విచారించింది. అయితే విచారణలో అతనిపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. దీంతో నీట్-యూజీ 2024 కేసులో అతనికి బెయిల్ లభించింది. అయితే ప్రస్తుతం అతను ఇతర కేసుల్లో కూడా నిందితుడిగా ఉండటంతో బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఆ కేసుల కారణంగా ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నట్లు సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తును అత్యంత లోతుగా నిర్వహించామని, కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి చట్టం ముందు నిలబెట్టామని సీబీఐ పేర్కొంది. నీట్-యూజీ 2024 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎవరూ చట్టం నుంచి తప్పించుకోకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.
लीजिए। मोदी जी की पूरी पोल खुल गई।
2024 में NEET का पेपर लीक हुआ। मोदी सरकार ने इसको मास्टरमाइंड कहकर गिरफ्तार किया। फिर सीबीआई ने जानबूझकर टाइम पे चार्जशीट दायर नहीं की जिसकी वजह से इसको तीन महीने में ही ऑटोमैटिक बेल दिलवा दी।
और आज उसको CBI से मोदी जी ने क्लीन चिट दिलवा दी।… https://t.co/bwbexAwjQa
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 23, 2026