July 23, 2026

Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..

Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
Reading Time: 2 minutes
Dharmendra Pradhan Resignation Neet Protests Bjp Strategy

Dharmendra Pradhan: ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ‘కాకరోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన ఆందోళనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పార్లమెంట్ ముట్టడికి యత్నించడంతో ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న పలువురు రాజకీయ నాయకులు కూడా ఆందోళనకారులను కలిశారు. అయితే, ఆందోళన తీవ్రమైనప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారనడానికి ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా దీనిపై అంతగా ఆందోళన చెందుతున్నట్లు లేదు. కేంద్రంలో వరుసగా 12 ఏళ్లుగా మంత్రిగా కొనసాగుతూ, మోదీ నమ్మకస్తులైన ముఖ్య నేతలలో ఒకరిగా పేరుగాంచిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించకపోవడానికి ప్రభుత్వం వద్ద ఐదు బలమైన కారణాలు ఉన్నాయి.

మొదటిది, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, విశ్వసనీయత, స్పష్టమైన ఆధారాల లేవని ప్రభుత్వం భావిస్తోందట. ఈ ఆందోళన వల్ల తమకు ఎలాంటి రాజకీయ నష్టం వాటిల్లదని భావిస్తుండటంతో ప్రభుత్వం రాజీనామా వైపు మొగ్గు చూపడం లేదట. రెండవది, ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పటికీ, వెంటనే ఎదుర్కోవాల్సిన ఎన్నికలు ఏవీ లేవు. మోదీ ప్రభుత్వంలో మంత్రుల పనితీరును ప్రధాని కార్యాలయం (PMO) ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటుంది. ఆయన పనితీరు సరిగ్గా లేకపోతే ఇన్ని సంవత్సరాలు కీలక శాఖలను అప్పగించేవారు కారని అధికార వర్గాలు విశ్వసిస్తున్నాయి. మూడవది, రాజీనామా డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు దానికి తగిన ప్రత్యామ్నాయాలను సూచించడంలో విఫలమయ్యారు. ఇటీవల నూతనంగా విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాజీనామా కోరడం సరైనది కాదని, అలాగే జూలై 20న జేపీ నడ్డాకు సమర్పించిన లిఖితపూర్వక వినతిపత్రంలో కూడా స్పష్టత లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. నాల్గవది, ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా యువ మోర్చా (BJYM) అధ్యక్షుడిగా, ABVP నాయకుడిగా పనిచేసి పార్టీ మూలాలతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న నమ్మకమైన నాయకుడు. ఐదవది, అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి ఒకవేళ ప్రధాన్ రాజీనామా తీసుకుంటే, మోదీ హయాంలో ప్రతిపక్షాల డిమాండ్‌కు తలొగ్గిన మొదటి సంఘటనగా ఇది నిలుస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రతిపక్షాలు మరే చిన్న విషయానికైనా ఇదే తరహా ఒత్తిడి తంత్రాలను ఉపయోగించేలా ప్రోత్సహించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఐదు కారణాలతో పాటు, రాజకీయంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీకి చాలా కీలకమైన వ్యక్తి. ఒడిశా రాష్ట్రంలో బీజేపీ సాధించిన ఘనవిజయాల్లో, పార్టీ విస్తరణలో ఆయన ప్రధాన ముఖచిత్రంగా నిలిచారు. 1983 నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో ఉన్న సుదీర్ఘ అనుబంధం, ఒడిశా సంఘ్ పరివార్‌లో ఆయనకున్న బలమైన పట్టు అధిష్టానం వద్ద మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా, గతంలో పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి, ఉక్కు వంటి కీలక మంత్రిత్వ శాఖలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఆయనకుంది. మరో కొన్ని రోజులు ఆయన విద్యాశాఖ మంత్రిగా కొనసాగితే, గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో 6 ఏళ్ల 2 నెలల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ మురళీ మనోహర్ జోషి పేరిట ఉన్న రికార్డును కూడా ప్రధాన్ తిరగరాయనున్నారు. ఈ వ్యూహాత్మక, రాజకీయ సమతుల్యతల వల్లే పోలీసులు, ఆందోళనకారుల నడుమ ఉద్రిక్తతలు పెరిగినా, పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతున్నా ప్రధాన్ రాజీనామాపై ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట.