July 23, 2026

Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!

Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
Reading Time: 2 minutes
Karimnagar Robbery Armed Gang Loots Over Rs 50 Lakh Cash And Gold After Threatening Family

Karimnagar: కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఘోర దారి దోపిడీ కలకలం రేపింది. ఆయుధాలతో, ముసుగులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ముఠా సభ్యులు కుటుంబ సభ్యులను కత్తులు, తుపాకులతో బెదిరించి, విచక్షణారహితంగా దాడి చేసి భారీగా సొత్తును దోచుకెళ్లారు.

అర్ధరాత్రి దాదాపు 12:30 గంటల సమయంలో, ఇంట్లో ఉన్న వృద్ధుడైన యజమాని తన కొడుకులు ఎవరైనా వచ్చారన్న భావనతో తలుపు తీశాడు. వెంటనే ముసుగులు ధరించి లోపలికి చొరబడ్డ దుండగులు అతనిపై దాడి చేశారు. వృద్ధుడిని తాళ్లతో బంధించి, ముక్కు నుంచి రక్తం వచ్చేలా దారుణంగా చితకబాదారు. ఆ తర్వాత ఇంట్లోని ముగ్గురు మహిళలను (యజమాని భార్య, ఇద్దరు కూతుళ్లు) పిస్టళ్లు, కత్తులతో బెదిరించి, బట్టలు, కాళ్లకు-చేతులకు ఓణీలతో కట్టేసి తీవ్రంగా భయాందోళనకు గురిచేశారు. లోపల విధ్వంసం సృష్టించిన దొంగలు, పెనుగులాట మధ్య ఇంట్లోని బంగారంతో పాటు సుమారు రూ.50 లక్షల కంటే ఎక్కువ నగదును దోచుకెళ్లారు.

ఆ తర్వాత, ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రెండు బైకులను కూడా దొంగిలించి పరారయ్యారు. బైపాస్ నుంచి మానేరు బ్రిడ్జి మీదుగా వరంగల్ వైపు పారిపోయినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రాథమికంగా గుర్తించారు. దుండగులు లోపలికి రాగానే నోరు విప్పవద్దని బెదిరించారని బాధితురాలు తెలిపారు. తమ వద్ద ఉన్న రివాల్వర్లు, కత్తులు చూపిస్తూ తమను కాళ్లు, చేతులు కట్టేసి హింసించారని, ఇంట్లోని బంగారం, పైసలన్నీ పట్టుకెళ్లారని కన్నీటిపర్యంతమయ్యారు. దొంగలు హిందీ మాట్లాడారని, వారి వద్ద నకిలీ పిస్టల్ సహా ఇతర ఆయుధాలు ఉన్నాయని బాధితులు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్‌లతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దీనిపై కరీంనగర్ టౌన్ డిసిపి వెంకటరమణ మాట్లాడుతూ.. ఘటనపై సమాచారం రాగానే అన్ని ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించాం. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉత్తర భారతదేశానికి చెందిన వారి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారిస్తున్నాం. అలాగే, బాధితుల పెద్ద అల్లుడు ఢిల్లీలో ఉంటారని, కుటుంబంలో కొన్ని గొడవలు ఉన్నట్లు తెలిసిందన్నారు. దాంతో కుటుంబ వివాదాల కోణంలోనూ, అలాగే వృత్తిపరమైన దొంగల పనా అనే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. ఎంత సొత్తు పోయిందనే దానిపై స్పష్టత కోసం పూర్తి వివరాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. ప్రస్తుతం కరీంనగర్ పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.