
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతితో బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. మొదటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో సుదర్శన్ నడిచారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగారు. 6 ఆగస్టు 1974న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో జన్మించారు. వరంగల్లోని మహబూబియా పంజతన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
సామాన్య మధ్యతరగతి వర్గానికి చెందిన సుదర్శన్రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం సొంత గ్రామంలో యూత్ క్లబ్ను ప్రారంభించారు. అదే ఆయన రాజకీయ జీవితానికి నాంది పలికింది. దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాజకీయాల్లో రాటుదేలుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. అందులో ఆయన చేరారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశ నుంచే కేసీఆర్కు సన్నిహితుడిగా, అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చురుకైన నాయకుడిగా ఎదిగారు. జిల్లా పార్టీ కన్వీనర్, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి, పొలిట్బ్యూరో సభ్యుడిగా పార్టీకి సేవలందించారు. 2001లో నల్లబెల్లి జడ్పీటీసీగా ఎన్నికై ప్రజాప్రతినిధి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2016లో తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులై 2018 వరకు పనిచేశారు. 2014లో నర్సంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై సుమారు 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో సుమారు 18,889 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దూకుడైన ప్రసంగశైలి, పార్టీ పట్ల విధేయత, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామీణ అభివృద్ధి, రైతుల సమస్యలు, సాగునీటి అంశాలపై తరచూ గళమెత్తిన నాయకుడిగా ఆయనకు పేరుంది.