Reading Time: < 1 minute
Brs Former Narsampet Mla Peddi Sudarshan Reddy Dies

Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం నెలకొంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత వారం రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున 12:51 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వారం రోజుల క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సీపీఆర్ (CPR) చేస్తూ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే, సీపీఆర్ చేస్తున్న సమయంలోనే ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అదించారు. అయినా లాభం లేకుండా పోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణ వార్త తెలిసిన వెంటనే నర్సంపేట నియోజకవర్గంలోని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి ఉదయం సూదర్శన్‌రెడ్డి భౌతికకాయాన్ని నర్సంపేటకు తరలించారు. దుగ్గొండి మండలం గిర్ని బావి నుంచి ర్యాలీగా భౌతికకాయాన్ని తరలించారు. నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో అశేష జనవాహిని సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి భారీ జనవాహిని అశ్రునయనాలతో భౌతికకాయాన్ని ముతోజిపేట ఇటుకలపల్లి గుండ్లపాడు రుద్రగూడెం మీదుగా నల్లబెల్లికి తరలించనున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.