Reading Time: 2 minutes
Godavari Krishna River Linking Chandrababu Promises Water To Every Acre

CM Chandrababu: గలగలా గోదావరి.. బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం వద్ద పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఆయన విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా, ఉన్నతాంధ్రగా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు..

సింహాద్రి అప్పన్న చెంతకు గోదావరి జలాలు
అనకాపల్లికి గోదావరి జలాలు రావడం చారిత్రాత్మకమైన రోజని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నీరు ఉంటేనే సాగుబాటు.. నీరు ఉంటే భద్రత, భవిత.. అనకాపల్లికి గోదావరి వచ్చింది.. వెలిగొండతో కృష్ణమ్మను తరలించి మార్కాపురం జిల్లాకు నీళ్లు ఇచ్చాం.. తూర్పు కనుమలు, అడవులు, హైవేలు దాటుకుని గోదావరి వచ్చింది.. వచ్చే ఏడాది నాటికి సింహాద్రి అప్పన్న, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రాలకు కూడా గోదావరి జలాలను తీసుకెళ్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరందించి జలహారతితో తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని అన్నారు. గోదావరి, కృష్ణా జలాలతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తామని, ఈ జల విజయం ప్రజల విజయమని పేర్కొన్నారు.

పోలవరానికి శాపవిముక్తి చేశాం
2019లో అప్పటి ప్రభుత్వం అధికారంలోకి రావడం పోలవరానికి శాపంగా మారిందని విమర్శించారు సీఎం చంద్రబాబు… 2024లో ప్రజలు కూటమికి అధికారం ఇవ్వడం ద్వారా పోలవరానికి శాపవిముక్తి కల్పించారని అన్నారు. విపక్షంలో ఉన్నప్పటికీ కొందరు విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి తర్వాత మాట మార్చారని ఆరోపించారు. ప్రాజెక్టుల పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే హెచ్చరించానని చంద్రబాబు తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల జలాలతో ప్రజలకు మేలు చేయడం తన జీవితాశయమని అన్నారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం
పోలవరం ఎడమ కాలువను విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు… 2028 నాటికి 12 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. అనకాపల్లి జిల్లా అందరూ అసూయపడే స్థాయిలో అభివృద్ధి చెంది మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వలస వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇక, విశాఖలో ఐదు డేటా సెంటర్లు వస్తే వాటికి సుమారు ఐదు టీఎంసీల నీరు అవసరమవుతుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి 500 టీఎంసీల నీటిని తీసుకురాగల సామర్థ్యం తమకు ఉందని తెలిపారు. జల వనరులను సమర్థంగా వినియోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..