
Eknath Shinde: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఫోటో లేకుండా క్రాప్ చేసి, పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫోటో అప్లోడ్ చేయడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఇలాంటి ‘‘చీప్ గేమ్స్’’ ఆడొద్దని హెచ్చరించారు. ‘‘పాకిస్తాన్ ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తుంది. వారు మోడీజీ ఫోటోను తొలగించవచ్చు. కానీ మోడీజీ తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి తొలగించగలరు’’ అని షిండే వార్నింగ్ ఇచ్చారు.
26వ SCO సదస్సుకు ముందు సభ్య దేశాల నేతలు కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ఎడిట్ చేసి విడుదల చేసింది. అసలు ఫొటోలో ఉన్న పలువురు నేతలను క్రాప్ చేసి, షెహబాజ్ షరీఫ్ను మధ్యలో ఉన్నట్లు పాకిస్తాన్ ఫోటోలో అప్ లోడ్ చేసింది. ఈ వ్యవహారంపై షిండే స్పందిస్తూ ప్రధాని ఫోటోను ఎడిట్ చేయడం వల్ల ఆయన స్థాయికి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు.
ఫోటోను తొలగించినంత మాత్ర భారత్లో, అంతర్జాతీయంగా ఆయనకు ఉన్న గుర్తింపు మారదని షిండే అన్నారు. 140 కోట్ల మంది మృదయాల్లో ప్రధాని మోడీ ఎప్పుడూ ఉంటారని చెప్పారు. మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరని అన్నారు. పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని, భారత్తో ఇలాంటి గేమ్స్ ఆడొద్దని చెప్పారు.