CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!

CM Revanth Reddy vs KTR : గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం నెలకొంది. కేటీఆర్పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, “పరువు ఉన్నవాడే పరువు నష్టం దావా వేస్తాడు” అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ సీసీఎస్లో అధికారికంగా ఫిర్యాదు చేస్తేనే గ్లోబరీనా అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తామని, తాను నేరుగా చొరవ తీసుకుంటే కక్షసాధింపు చర్యగా ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. అలాగే జన్వాడ భూములు, గ్లోబరీనా వ్యవహారం ఎలా ముడిపడి ఉన్నాయో విచారణ చేయిస్తామని సీఎం వ్యాఖ్యానించారు.
దీనికి గట్టి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్, తాను ఇప్పటికే సీఎంకు డిఫమేషన్ నోటీసు పంపానని, సరైన సమాధానం రాకపోతే కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. గ్లోబరీనా తన సంస్థే అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాంతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకుందో చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే వెంటనే విచారణ జరిపించాలని, తామిద్దరం లై డిటెక్టర్ పరీక్షకు వెళ్దామని సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ విసిరారు. గ్లోబరీనా, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి ఏ అంశంపైనా కేసులు పెట్టుకోవచ్చని, రాహుల్ గాంధీతో వచ్చి తన ఇంటి ముందు ధర్నా చేసినా సిద్ధమేనని వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతోంది.