July 23, 2026

Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు

Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
Reading Time: 2 minutes
Pawan Kalyan Reviews Jal Jeevan Mission Projects In Palnadu And Prakasam

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ మరియు అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. సమీక్ష సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తాగునీటి కొరత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఈ రెండు మెగా ప్రాజెక్టులు శాశ్వత పరిష్కారంగా మారనున్నాయని పవన్ కల్యాణ్‌ తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని చెప్పారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.2,500 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించనున్నారు.

ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు పవన్‌ కల్యాణ్‌కు వివరించారు. రెండు ప్రాజెక్టుల్లో కలిపి ఇప్పటికే 200 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులో ఇంటేక్ వెల్ పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. పల్నాడు ప్రాజెక్టులో 152 కిలోమీటర్ల పైప్‌లైన్ నెట్‌వర్క్ నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల మధ్య పైప్‌లైన్ నిర్మాణం, అటవీ అనుమతులు వంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించాలని పవన్ సూచించారు. పనుల్లో ఆలస్యం జరిగే పరిస్థితులు లేకుండా అన్ని శాఖల మధ్య సమన్వయం పెంచాలని కూడా ఆదేశించారు.

పనుల నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్‌.. భుజానికి జరిగిన శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణ నాణ్యతను పరిశీలిస్తానని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వొద్దని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు నిరంతరంగా, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.. ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..