July 23, 2026

Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!

Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
Reading Time: 2 minutes
Bhatti Vikramarka Condemns Rahul Gandhis Arrest Demands Justice Over Neet Row

Bhatti Vikramarka: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై జరిగిన పోలీస్ దమనకాండను నిరసిస్తూ ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా అరెస్ట్ చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టు ను నిరసిస్తూ హన్మకొండ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి కొండ సురేఖతో కలిసి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజుతో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను కర్కశంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించడమేనని మండిపడ్డారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీతో దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని, ఈ అక్రమాలపై ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తున్న అమాయక విద్యార్థులు, ఆడపిల్లల పట్ల పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి లాఠీఛార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

​మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో అరాచక పాలన సాగుతోందని, ప్రజల సమస్యలు వినడం మానేసి ప్రశ్నించిన వారిపై దాడులు, అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. లాఠీలతో విద్యార్థుల గొంతును, అరెస్టులతో రాహుల్ గాంధీ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపలేదని స్పష్టం చేశారు. దేశ యువత భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ దిక్సూచిలా నిలిచి పోరాడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆఖరి వరకు పోరాడతాయని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ పోరాటానికి దేశంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.