July 23, 2026

CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!

CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
Reading Time: 2 minutes
Cm Revanth Reddy Slams Centre Over Neet Issue Demands Dharmendra Pradhans Dismissal

CM Revanth: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ర్యాలీగా అక్కడికి చేరుకున్న సీఎం, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. నీట్ (NEET) పరీక్షల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “నీట్ పరీక్షలను పల్లీ బఠాణీల మాదిరిగా అమ్మేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడింది” అని మండిపడ్డారు.

ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమించారని, అలాంటి విద్యార్థులపై పాశవికంగా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సీఎం అన్నారు. వందలాది మంది విద్యార్థులు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మరికొందరు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. వారి తరఫున పోరాడేందుకు రాహుల్ గాంధీ ముందుకు వచ్చారని అన్నారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిడికి లోనైన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు.

దేశ ప్రజల కోసం త్యాగాలు చేయడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ పదేళ్ల పాటు ప్రతిపక్ష నేత హోదా తీసుకోలేదని, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతోనే తర్వాత ఆ బాధ్యతను స్వీకరించారని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన తప్పిదాల కారణంగా 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అదే సంస్థ తర్వాత CBSE పరీక్షల మూల్యాంకన కాంట్రాక్టును కూడా పొందిందని ఆరోపించారు.

నీట్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన్ను తొలగించకపోతే ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడే చర్యలు తీసుకోవాలని కోరారు.