July 23, 2026

Andhra News: ఏపీలో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే?

Andhra News: ఏపీలో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే?
Reading Time: < 1 minute
Andhra News: ఏపీలో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే?

విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు ప్రక్రియపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర విద్యుత్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తిమ్మాపురంలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 2014-19 ప్రభుత్వ హయాంలోనే తిమ్మాపురం వద్ద కల్చరల్ సెంటర్ నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా, శంకుస్థాపన కూడా పూర్తి చేసినట్లు గుర్తుచేశారు.

అయితే, అప్పట్లో జారీ చేసిన జీవోలో లీజు గడువును స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. ఈ అంశంపై ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వద్దకు కల్చరల్ సెంటర్ కార్యవర్గం ఎన్నిసార్లు వెళ్లినా, సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే స్పందించారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

లీజు గడువును స్పష్టంగా పేర్కొంటూ, వీలైనంత త్వరగా నూతన జీవో జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఈ సందర్భంగా కల్చరల్ సెంటర్ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.