Reading Time: < 1 minute
Ap Cm Chandrababu Naidu Holds Special Meeting With Ministers After Cabinet Session

CM Meeting with Ministers After Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు. అజెండా అంశాలు ముగిసిన తర్వాత రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇక, అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఒక్కో అంశంపై లఘు చర్చ చేపట్టాలని సీఎం సూచించారు. అందుకు అనుగుణంగా చర్చించాల్సిన అంశాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు, మంత్రులకు ఆదేశించారు. మరోవైపు.. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి సమర్థవంతంగా వెళ్లేలా చూడాలని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా సందర్భానుసారం తాను మరియు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా చర్చల్లో పాల్గొంటామని వెల్లడించారు. శాఖల వారీ పద్దులపై జరిగే చర్చల్లో సంబంధిత మంత్రులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఒక మంత్రి తన శాఖకు సంబంధించిన అంశంపై మాట్లాడినప్పుడు, అనుబంధంగా స్పందించే ఇతర సభ్యులు కూడా తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.