Reading Time: < 1 minute

నల్లగొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం…నోష్ ఫార్మా కంపెనీలో పేలుడు… 9 మందికి గాయాలు..

Caption of Image.

నల్లగొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ( మే 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున తెల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడుతోంది. దీంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ప్రమాదం జరిగిన సమయంలో 3వ బ్లాక్ లో ఉన్న 9 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఘటనపై స్పందించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తరచు ప్రమాదాలు జరిగుతున్న కంపెనీని సీజ్ చేసి… ప్రమాదం పై పూర్తి విచారణ జరపాలని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.