Reading Time: < 1 minute
Tirumala Laddu Report Submitted To Ap Government Key Findings By Dinesh Kumar Committee

TTD Laddu Report: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. తిరుమల లడ్డూ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదిక అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి నాణ్యత, సరఫరా విధానం వంటి అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ తన నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసిన ఈ కమిటీ పరిశీలనలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఈవో సింఘాల్ వ్యవహారశైలిపై కమిటీ విమర్శలు గుప్పించింది. నెయ్యి నాణ్యతలో కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని నివేదికలో పేర్కొంది.

Read Also: Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!

అలాగే, సింఘాల్ ఆధ్వర్యంలో నెయ్యి కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన నియమాలు సడలింపుకు గురయ్యాయని కమిటీ గుర్తించింది. ఈ సడలింపులు వ్యవస్థలో లోపాలకు కారణమయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ అంశంపై బోర్డును ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, సింఘాల్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ పారదర్శకంగా, లోపరహితంగా ఉండాలని సూచించింది. టెండర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సరఫరాదారుల ఎంపికలో కఠిన ప్రమాణాలు పాటించాలని దినేష్ కుమార్ కమిటీ సూచించింది. అయితే, ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ చర్యలు కీలకంగా భావిస్తున్నారు.