Reading Time: 2 minutes
Kerala Assembly Election 2026 Exit Polls Udf Ldf Left Decline India

End of Left Rule: దేశ రాజకీయాల్లో ఓ శకం ముగియబోతోందా? కేరళ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేరళలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. అయితే అంతకు ముందే.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ పెద్ద మార్పు రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఈసారి కేరళలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు ఈసారి కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమికి పట్టం కడుతున్నాయి. మొత్తం 140 స్థానాలకు గానూ మేజిక్ ఫిగర్ 71 కాగా, ‘పోల్ ఆఫ్ పోల్స్’ అంచనా ప్రకారం.. యూడీఎఫ్ 77 సీట్లతో అధికారంలోకి రానుంది. మరోవైపు అధికార ఎల్డీఎఫ్ (LDF) కేవలం 59 స్థానాలకే పరిమితం కావచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా వంటి సంస్థలు యూడీఎఫ్‌కు 90 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెబుతుంటే.. పీపుల్స్ ఇన్‌సైట్ మాత్రం హోరాహోరీ పోరు తప్పదని అంచనా వేస్తోంది. ఏదేమైనా మెజారిటీ సర్వేల మొగ్గు మాత్రం అధికార మార్పిడి వైపే ఉంది.

ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా వెలిగిన వామపక్షాలకు ఇప్పుడు కేరళ మాత్రమే ఆఖరి ఆశ్రయం. 2021లో పినరయి విజయన్ వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించినా, ఈసారి మాత్రం 80 ఏళ్ల విజయన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందనేది విశ్లేషకుల వాదన. ఒకవేళ కేరళ కూడా చేజారితే, భారత రాజకీయ చిత్రపటం నుంచి వామపక్షాల పాలన పూర్తిగా కనుమరుగవుతుంది. 1957లో కేరళలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ పార్టీలు, ఆ తర్వాత బెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా, త్రిపురలో పావు శతాబ్దం పాటు రాజ్యమేలాయి. కానీ కాలక్రమేణా బెంగాల్‌లో ప్రాతినిధ్యం కోల్పోయి, త్రిపురలో నామమాత్రపు స్థానాలకు పరిమితమయ్యాయి.

ఇక, కేరళ వెలుపల వామపక్షాల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. గతంలో కింగ్‌మేకర్‌గా ఉన్న బీహార్‌లో 2025 ఎన్నికల నాటికి వీరి సంఖ్య కేవలం 3 ఎమ్మెల్యేలకు పడిపోయింది. జార్ఖండ్‌లో ఇద్దరు, తమిళనాడులో నలుగురు (డీఎంకే పొత్తుతో), అస్సాం, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలలో ఒక్కొక్కరు మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కనీసం ఒక్క సీటు సైతం గెలవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేరళ ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, భారత రాజకీయాల్లో వామపక్ష భావజాల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక తీర్పుగా మారబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, ఎర్రజెండా కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది!!