Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..

Bengal Elections: పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ బుధవారం జరిగాయి. ఈ దశలో కూడా బెంగాల్ ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మొదటి విడతలో బెంగాల్ పోలింగ్ శాతం 90 శాతాన్ని దాటింది. రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ శాతం 89.99 శాతానికి చేరుకుంది. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిల్చున్న ఓటర్లు ఓటు వేసే అనుమతి ఉంది. 2021లో ఇదే 142 స్థానాలకు 80.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు దీనిని అధిగమించి ప్రజలు ఓటు వేశారు. బెంగాల్లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 294 కాగా, ఏప్రిల్ 23న జరిగిన తొలి విడతలో 152 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Read Also: Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 92.46 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తర కోల్కతా నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల నాటికి 87.77 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ హై-ఓల్టేజ్ ఎన్నికల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ సహా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడవుతాయి.