
Srilanka Cricket: శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket)లో భారీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షమ్మీ సిల్వా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు, మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా సామూహికంగా తమ పదవులకు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయం వెనుక శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బోర్డులో మార్పులు అవసరమని ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా బోర్డుపై తీవ్రంగా వినిపించాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా క్రికెట్ వ్యవహారాలు నిర్వహించేందుకు ఒక ఇంటరిమ్ కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం శ్రీలంక క్రికెట్కు మరిన్ని సమస్యలను తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇప్పటికే ప్రభుత్వ జోక్యాన్ని అంగీకరించబోదని స్పష్టంగా పేర్కొంది. ICC కేవలం ఎన్నికైన క్రికెట్ బాడీని మాత్రమే గుర్తిస్తుంది.
గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ICC కఠిన వైఖరి అవలంబించింది. ముఖ్యంగా 2023లో శ్రీలంకపై సస్పెన్షన్ విధించడం ద్వారా ఫండింగ్ నిలిపివేయడం, టోర్నమెంట్ హక్కులు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇక మైదానంలో కూడా శ్రీలంక జట్టు ప్రదర్శన నిరాశాజనకంగానే కొనసాగుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్లో, ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్లో కూడా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కోచ్గా గ్యారీ కిర్స్టన్ నియామకం జరిగినప్పటికీ జట్టులో పెద్ద మార్పు కనిపించలేదు.