July 14, 2026

Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?
Reading Time: 2 minutes
Off The Record Over Dadi Veerabhadra Rao

ఆ మాజీమంత్రి యాక్టివ్ పాలిటిక్స్‌కు షార్ట్ గ్యాప్ ఇచ్చి సీక్రెట్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారా? స్వపక్షంలోనే విపక్షంగా మారి వేట మొదలెట్టినట్టారా? సార్‌ చేస్తున్న అండర్‌ కవర్‌ ఆపరేషన్స్‌తో సొంత పార్టీ టీడీపీ నాయకులకు సైతం చెమటలు పడుతున్నాయా? ఎవరా సీనియర్ నేత…? సొంత కత్తే అయినా తేడా వస్తే తెగడం ఖాయమని కలవరపడుతున్నది ఎవరు…? దాడి వీరభద్రరరావు. మాజీ మంత్రి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఈ నేతను పార్టీలతో సంబంధం లేకుండా… ఉమ్మడి విశాఖ నేతలంతా మాస్టారు అని పిలుస్తుంటారు. కానీ… ఇప్పుడు మాస్టార్ని చూస్తేనే… సొంత పార్టీ టీడీపీ నాయకులు కొందరు హడలిపోతున్నారట. ఇంకొందరైతే…. అమ్మో… ఇప్పుడాయన ఏజెంట్‌ భద్ర. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కాస్త కాస్త వ్యంగ్యం, మరికాస్త వాస్తవాన్ని మిక్స్‌చేసిన స్వరంతో అంటున్నట్టు సమాచారం. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్లో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన దాడి ఒకప్పుడు అనకాపల్లి టీడీపీలో తిరుగులేదని అనిపించుకున్నారు. 2004,2009ఎన్నికల్లో ఓడిపోయినా… ఎమ్మెల్సీ ఛాన్స్‌తో పాటు మండలిలో ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించింది టీడీపీ. కానీ…. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినాయకత్వంతో విభేదించి వైసీపీలో చేరారాయన.

ఆ ఎన్నికల్లో వీరభద్రరావు కొడుకు రత్నాకర్‌కు విశాఖ పశ్చిమ ఫ్యాన్‌ టిక్కెట్‌ ఇవ్వడం, ఆయన ఓడిపోవడం అప్పటి పరిణామాలు. ఇక 2019 నాటికి తిరిగి అనకాపల్లి రాజకీయాల్లో యాక్టివ్ రోల్ తీసుకున్న ఈ సీనియర్ నేత భుజాన పెద్ద బాధ్యత పెట్టారు జగన్. అప్పుడు తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన గుడివాడ అమర్నాథ్‌ను గెలిపించాలని నిర్ధేశించారు. జగన్ వేవ్….కాపు ఫ్యాక్టర్, బలంగా ఉన్న వీరభద్రరావు వర్గం సహకారం… అన్నీ కలిసొచ్చి తేలిగ్గానే గెలిచారు అమర్నాథ్‌. ఆ తర్వాతి పరిణామాల్లో అమర్‌నాథ్‌ రాష్ట్ర మంత్రి అయిపోగా… అప్పటి రీజనల్ కో ఆర్డినేటర్స్‌తో సఖ్యత లేక దాడి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సివచ్చింది. ఇక 2024 ఎన్నికల ముందు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకంటే అనకాపల్లి పాలిటిక్స్ ఆశ్చరకరమైన మలుపులు తిరిగాయి. దాడి టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఒకటైతే… రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి కొణతాలతో 40ఏళ్ళ తర్వాత దాడి చేతులు కలపడంపై రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. పవన్‌కల్యాణ్‌తో వున్న సాన్నిహిత్యం కారణంగా కూటమి గెలుపు కోసం వీరభద్రరావు కసిగా పనిచేశారని స్వపక్షం కితాబిచ్చి మరీ సంబరాలు చేసుకుంది. ఇక ఆ తర్వాత అనూహ్యంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు గ్యాప్ ఇచ్చారు దాడి. అలాగని ఆయనేం ఖాళీగా లేరని, అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో బిజీగా ఉన్నారన్న సంగతి కాస్త ఆలస్యంగా తెలిసి సొంత పార్టీ నాయకులే షాకవుతున్నారట. కూటమి ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని, తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని స్వయంగా సీఎం వార్నింగ్ ఇస్తున్నారు. అయినాసరే…. కొందరు నేతల చీకటి వ్యవహారాలు అధినేత ఆలోచనలకు కూడా అందనంతగా చేయిదాటిపోయాయనేది జిల్లాలో నడుస్తున్న ప్రచారం.

సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేలకు షాడోలుగా మారిన వ్యక్తులు పాలు నీళ్ళలా కలిసిపోయి… మీకింత….మాకింత అనే స్ధాయిలో దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే… అడ్డగోలు మైనింగ్‌తోపాటు వివిధ మార్గాల్లో వసూళ్ళ వంటి అంశాలపై మాజీ మంత్రి తన మనుషుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారట. తానము కూడా వాటిని నిర్ధారించుకున్నాక పూర్తి ఆధారాలతో హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు, అధికారుల కారణంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్న కారణంతో మాస్టారు అండర్ కవర్ ఆపరేషన్ మొదలెట్టి అందరి బండారాన్ని బయటపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ… ఎమ్మెల్యేల అనుచరగణం మాత్రం దీన్ని మరో కోణంలో ప్రచారం చేస్తోంది. రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు వీరభద్రరరావు తాపత్రయపడుతున్నారని, ఏవేవో రిపోర్ట్స్‌ పంపి హైకమాండ్ దగ్గర పూర్వపు ఇమేజ్ పొందే ప్రయత్నాల్లో ఉన్నారంటు విమర్శిస్తున్నారు. మాస్టారు మాత్రం… ఎవరేమనుకున్నా… నో కాంప్రమైజ్ అని గట్టిగానే అంటున్నట్టు సమాచారం. దీంతో సొంత కత్తే అయినా జాగ్రత్తగా వుండకపోతే తెగడం ఖాయమని కూటమి నేతలు కలవరపడుతున్నారట. దాడి ప్రయత్నం కూటమి ప్రభుత్వం ప్రతిష్టను నిలబెట్టినా రాజకీయంగా అది ఆయనకు ప్లస్సా, మైనస్సా అనేది కాలమే నిర్ణయించాలి.