Reading Time: < 1 minute
Pakistan Medicine Crisis Deepens Amid Oil Shock And Inflation Surge

Pakistan Medicine Crisis: పాకిస్తాన్‌ గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు ఆ దేశాన్ని ‘‘మెడిసిన్ సంక్షోభం’’ భయపెడుతోంది. ఇరాన్ యుద్ధం వల్ల ఓ పక్క ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలోనే, ప్రాణాలు కాపాడే ఔషధాలు ఇప్పుడు పాకిస్తాన్‌లో కనిపించడం లేదు. పిండి, నూనె, గ్యాస్ ఇలా నిత్యావసర సరుకుల కొరత ఎదుర్కొంటున్న దాయాది, ఇప్పుడు ‘‘ఔషధ సంక్షోభం’’ లో ఉంది.

ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం పాకిస్తాన్‌ను ఇబ్బంది పెడుతోంది. దేశంలో ఇంధన ధరలు పెరిగాయి, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. లాహోర్, కరాచీ, పెషావర్ వంటి ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఏర్పడింది. రోగులకు అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో లేవు. మరోవైపు మందుల ధరలు తీవ్రంగా పెరగడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది.

Read Also: BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

నివేదికల ప్రకారం.. 2023 నుంచి పాకిస్తాన్ మెడిసిన్స్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2024లో సుమారు 50 శాతం, 2025లో 30-40 శాతం పెరిగాయి. 2026లో మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఈ పెరుగుదల మరింత వేగమైంది. ఇదే సమయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై 18 శాతం పన్ను విధించడంతో మెడిసిన్స్ ధరలు మరింత పెరిగాయి. పాకిస్తాన్‌లో అమ్ముడయ్యే మందుల్లో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ఈ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలతో పాకిస్తాన్‌లో కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారక నిల్వలు తగ్గడం, కరెన్సీ పతనం వంటి సమస్యల్ని ఎదుర్కొంటోంది.