Reading Time: < 1 minute

రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మీద, ప్రకటించిన నాటి నుంచి అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాకపోవడం సహా కొన్ని ఆలస్యాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమా ప్రమోషన్స్ రేపటి నుంచి మొదలుపెట్టబోతున్నారు. రేపు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్లా మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు.

ప్రింట్ సహా ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కి కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతానికి బుచ్చిబాబు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఒకసారి ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక బుచ్చిబాబు సహా రామ్ చరణ్, జాన్వీ కపూర్ వంటి వాళ్లు కూడా ఈ ప్రమోషన్స్ లో భాగమయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఆ మధ్యలోనే సాంగ్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే కాస్త గ్యాప్ వచ్చిన సరే, ఇప్పుడు ఫ్రెష్ గా మరోసారి ఇంటర్వ్యూలు ప్రారంభించబోతున్నారు. ఒక రకంగా ఇది ‘పెద్ది’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కి శుభారంభం అనే చెప్పాలి.