Reading Time: < 1 minute
Mamata Banerjee Resignation Row West Bengal Election 2026 Constitutional Crisis

Mamata Banerjee: బీజేపీ ఘన విజయం సాధించి, టీఎంసీ ఘోర పరాజయం చూసిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్‌లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని, రాజ్ భవన్ వెళ్లనని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల ఫలితాలను దొంగిలించిందని, 100 నియోజకవర్గాల్లో విజయం దొంగిలించబడిందని ఆమె ఆరోపించారు. నైతిక విజయం తమదే అంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 207 సీట్లను దక్కించుకుంది. అయితే, బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయిందంటూ ఆమె ఆరోపించారు. తాను ఓడిపోలేదని స్పష్టం చేశారు.

సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పార్టీ ఓడిపోతే సీఎం గవర్నర్‌కు తన రాజీనామా లేఖ సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. అయితే, బెంగాల్ పరిణామాలు మాత్రం దేశానికి కొత్తగా ఉన్నాయి. ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలంటే ‘‘శాసన సభ’’ విశ్వాసం అనేది ప్రాథమిక సూత్రం. ఎన్నికల్లో ఓడిపోయానని తెలిసిన తర్వాత మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సి ఉంది. అయినా ఆమె ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

గవర్నర్ రంగ ప్రవేశం:

సీఎం పదవికి రాజీనామా చేయనని మమతా బెట్టు చేస్తే, గవర్నర్ యాక్టీవ్ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ కొన్ని చర్యల్ని తీసుకోవచ్చు. ఇందులో రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయవచ్చు. అంటే దీని అర్థం శాసనసభను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావచ్చు.

మరో చర్య ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టిలక్ 164(1)ను ఉపయోగించే అవకాశం ఉంది. దీని ప్రకారం, ముఖ్యమంత్రి ఆమె మంత్రివర్గం ‘‘గవర్నర్ విశ్వాసం ఉన్నంత కాలం’’ పదవిలో కొనసాగుతారు. దీని ద్వారా గవర్నర్ ఆమెను పదవి నుంచి తొలగించవచ్చు. ఇదే సమయంలో మరో ఆప్షన్ కూడా గవర్నర్ వద్ద ఉంది. మమతా బెనర్జీని తన మెజారిటీ నిరూపించుకోవచ్చని ఆదేశించవచ్చు. అయితే, దీనికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 80 స్థానాలు మాత్రమే లభించాయి. ఇది మెజారిటీ మార్కు కన్నా 68 సీట్లు తక్కువ.