July 14, 2026

Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
Reading Time: 2 minutes
Range Rover Sv Price Cut India Fta Impact Luxury Cars

Range Rover SV : భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇండియా తన ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన రేంజ్ రోవర్ SV, రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరలను గణనీయంగా తగ్గించింది. భారత్-యూకే మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ చర్యతో దిగుమతి సుంకాల్లో లభించిన ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ధరల్లో భారీ తగ్గింపు.. కస్టమర్లకు లాభం

తాజా ధరల ప్రకారం రేంజ్ రోవర్ SV ధరను రూ.4.25 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు తగ్గించారు. అంటే ఈ మోడల్‌పై నేరుగా రూ.75 లక్షల వరకు కోత విధించారు. అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరను రూ.2.75 కోట్ల నుంచి రూ.2.35 కోట్లకు తగ్గిస్తూ రూ.40 లక్షల తగ్గింపు ఇచ్చారు. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దీంతో లగ్జరీ SUV కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవకాశంగా మారింది.

రేంజ్ రోవర్ SVలో కొత్త ఫీచర్లు

ధర తగ్గింపుతో పాటు రేంజ్ రోవర్ SV మోడల్‌లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఇప్పుడు ఇందులో SV Ultra Metallic పెయింట్ ఆప్షన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. ఇది గ్లోస్ , సాటిన్ ఫినిష్‌లలో లభ్యమవుతూ వాహనానికి మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. JLR ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా మాట్లాడుతూ, ఈ నిర్ణయం పూర్తిగా కస్టమర్ ఫస్ట్ విధానంతో తీసుకున్నదని వెల్లడించారు.

ఈ మోడల్స్‌పై ప్రభావం ఉండదు

ఈ ధరల తగ్గింపు యూకే నుంచి పూర్తిగా దిగుమతి అయ్యే (CBU) మోడల్స్‌కే వర్తిస్తుంది. భారత్‌లో అసెంబుల్ చేసే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఇవోక్, రేంజ్ రోవర్ వెలార్, డిస్కవరీ స్పోర్ట్ వంటి మోడల్స్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే స్లోవాకియాలో తయారయ్యే ల్యాండ్ రోవర్ డిఫెండర్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మోడల్స్ కూడా ప్రస్తుతం ఉన్న ధరలకే కొనసాగుతాయి. ఈ నిర్ణయం ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా మార్కెట్‌లో మరింత పోటీగా నిలవాలని చూస్తోంది. ధరలు తగ్గడంతో పాటు ఫీచర్లను మెరుగుపరచడం ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలనే వ్యూహంతో కంపెనీ ముందుకు సాగుతోంది.