
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) సాధించిన అసాధారణ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, అన్నా డీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించడం వెనుక ఒక యువ వ్యూహకర్త మేధస్సు దాగి ఉంది. అతడే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కపిల్ సాహూ.
గతంలో ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐప్యాక్ (I-PAC) సంస్థలో కీలక సభ్యుడిగా పనిచేసిన కపిల్ సాహూ రెండేళ్ల క్రితం 12 మంది కోర్ టీమ్ సభ్యులతో బయటకు వచ్చేసి సొంతంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సంస్థను స్థాపించాడు. ఐప్యాక్ పాత వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పరిణామాలకు సరిపోవట్లేదని భావించిన తన సొంత బృందంతో సరికొత్త ప్రయోగాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో తన సేవలు అందించిన కపిల్ సాహూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించి తన సత్తా చాటారు. 2024లో ప్రశాంత్ కిషోర్ టీవీకే నుంచి తప్పుకున్న తర్వాత కపిల్ సాహూ ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల బలాబలాలు, పార్టీ నిర్మాణం వంటి కీలక అంశాల్లో విజయ్కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విజయ్ ఎన్నికల ర్యాలీలు, సర్వేలు, డేటా అనాలిసిస్ మరియు డిజిటల్ మీడియా కమ్యూనికేషన్స్లో కపిల్ బృందం అనుసరించిన వ్యూహాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి.
75 ఏళ్ల చరిత్ర కలిగిన డీఎంకే, 52 ఏళ్ల అన్నా డీఎంకే వంటి బలమైన పార్టీల ఓటు బ్యాంకును టీవీకే వైపు తిప్పడంలో కపిల్ సాహూ సక్సెస్ అయ్యారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన పార్టీ అతిపెద్ద రాజకీయ శక్తులను ఓడించి చరిత్ర సృష్టించడం వెనుక కపిల్ సాహూ వ్యూహరచన ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్లో కపిల్ సాహూ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది.