
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన, ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ నెలలో బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా హాల్స్ను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా బి, సి సెంటర్లలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనీస నిర్వహణ ఖర్చులను కూడా రాబట్టలేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. నగరాల్లో సైతం పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు. చాలా థియేటర్లు రోజుకు కేవలం ఒకటి లేదా రెండు షోలతోనే నెట్టుకొస్తున్నాయి.
సాధారణంగా వేసవి కాలం టాలీవుడ్ బాక్సాఫీస్కు కాసుల వర్షం కురిపించే అతిపెద్ద సీజన్. కానీ, గత మూడేళ్లుగా ఐపీఎల్ (IPL) సాకుతో టాలీవుడ్ మేకర్స్ సరైన ప్రణాళిక లేకుండా ఈ కాలాన్ని వృథా చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమవడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. టాలీవుడ్ మేకర్స్ ప్రణాళికా లోపం వల్ల థియేట్రికల్ వ్యాపారం ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. ఇక ప్రస్తుతం పరిశ్రమ వర్గాలన్నీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపైనే గట్టి ఆశలు పెట్టుకున్నాయి. జూన్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తుందని ట్రేడ్ నిపుణులు బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమా తెలుగు సినిమా కరువును తీర్చి, థియేటర్లకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తుందని అంతా ఆశిస్తున్నారు.