
Air India to Cut Flights: దేశీయ విమానయాన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెరుగుతున్న జెట్ ఇంధన (ATF) ధరల ప్రభావంతో ఎయిర్ ఇండియా తన విమాన కార్యకలాపాలను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులను కోత పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జెట్ ఇంధన ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దీని ప్రభావం విమానయాన సంస్థలపై తీవ్రంగా పడుతోంది. ఈ పరిస్థితుల్లో అనేక అంతర్జాతీయ రూట్లు నష్టాల్లోకి జారడంతో, సేవలను తగ్గించడం తప్ప మరో మార్గం లేదని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
సమాచారం ప్రకారం, ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ ఈ విషయంపై అంతర్గతంగా సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జెట్ ఫ్యూయల్ ధరల పెరుగుదల, కరెన్సీ మార్పిడి రేట్ల మార్పులు, గగనతల పరిమితులు వంటి అంశాలు కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగి, విమానయాన రంగానికి అదనపు భారం మోపుతున్నాయి.
దేశీయంగా కూడా ఎయిర్ ఇండియా లాభాలపై ప్రభావం పడింది. ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోవడం సంస్థలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో సంస్థ తన కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ఈ నిర్ణయంపై ఎయిర్ ఇండియా తన సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చి, సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఐక్యతతో ముందుకు సాగాలని కోరినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో విమాన షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.