
ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులాను టార్గెట్ చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను లొంగదీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడి చేసి అగ్ర నేతలందరినీ అంతమొందించింది. హార్ముజ్ను దిగ్బంధించి ఇరాన్ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా అగ్ర రాజ్యం అమెరికా మరొక దేశాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు స్పాట్ ఫిక్స్ చేసింది. లేటెస్ట్గా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని.. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ఆపరేషన్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తక్షణమే క్యూబా నాయకత్వం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం విధించారు.
‘‘నేను అక్కడికి ఒక నౌకను పంపిస్తే చాలు. వారు లొంగిపోతారు.’’ అని అన్నారు. అమెరికా త్వరలో క్యూబాను ఆక్రమించుకుంటుందని అన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచెస్లోని ‘ఫోరమ్ క్లబ్’లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రతినిధి డాన్ మైకాను ఉద్దేశించి ట్రంప్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ‘‘డాన్ స్వస్థలం క్యూబా. దానిని మనం దాదాపు వెంటనే ఆక్రమించుకోబోతున్నాం.’’ అని అన్నారు.
క్యూబాలోని ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ.. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయన్నారు. అయితే తాను ఒకేసారి అనేక రంగాల్లో పోరాడటానికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి పెద్ద సంఘర్షణ లేకుండానే క్యూబాను లొంగదీసుకోగలదని అన్నారు. ‘‘మేము ఇరాన్ నుంచి వైదొలగినప్పుడు.. మా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక అయిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఉంటుంది. క్యూబా తీరానికి కేవలం 100 గజాల దూరంలో దానిని మేము నిలిపివేస్తాం.’’ అని అన్నారు. అమెరికా యుద్ధనౌకను చూడటమే చాలు. ఆయన ఇంకా చమత్కరిస్తూ.. ‘‘వారు (క్యూబన్లు) దాన్ని చూసి.. ‘‘మీకు చాలా ధన్యవాదాలు.మేము లొంగిపోతున్నాం.’’ అని చెబుతారని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.