Reading Time: 3 minutes
Rr Vs Dc Vaibhav Sooryavanshi Jamieson Controversy Delhi Win

Kyle Jamieson: రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో మరోసారి వైభవ్ సూర్య వంశీ హాట్‌టాపిక్‌గా మారాడు. తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించే వైభవ్ ఈ సారి కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. జేమీసన్ వేసిన ఒక అద్భుతమైన యార్కర్‌కు వైభవ్ నిస్సహాయుడయ్యాడు. ఇక, కేవలం 15 ఏళ్ల వయసున్న రాజస్థాన్ యువ సంచలనం వైభవ్‌ని అవుట్ చేసిన తర్వాత ఢిల్లీ బౌలర్ కైల్ జేమీసన్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైభవ్ ముందే గట్టిగా చప్పట్లు కొడుతూ, అత్యంత దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ అంశంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. “అతడికి ఇంకా 15 ఏళ్లే, కొంచెం నిదానం జేమీసన్” అంటూ నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. అంత చిన్న వయసున్న ప్లేయర్ పట్ల అంతటి అగ్రెషన్ చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ సెలబ్రేషన్స్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వరుసగా మూడు ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు విజయపథంలోకి అడుగు పెట్టింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన రసవత్తర పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు పునాది వేశారు. రాహుల్ 40 బంతుల్లోనే 75 పరుగులు చేయగా, నిస్సాంక 33 బంతుల్లో 62 పరుగులతో విరుచుకుపడ్డారు. చివరిలో ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్), అశుతోష్ శర్మ (25 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) తొలి రెండు ఓవర్లలోనే అవుట్ కావడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. అయితే, ఈ సీజన్‌లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రియాన్ పరాగ్ (90 పరుగులు, 50 బంతుల్లో) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. గత మ్యాచ్‌లో ‘వేపింగ్’ చేస్తూ దొరికిపోయి జరిమానా ఎదుర్కొన్న పరాగ్, ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ (42)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చివరి ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా కేవలం 14 బంతుల్లో 47 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో రాజస్థాన్ స్కోరు 200 దాటింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు, అందులో కీలకమైన పరాగ్ వికెట్ ఉంది. భారీ స్కోరు చేసినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి రాజస్థాన్ బౌలర్లు నిలవలేకపోయారు.