
Telangana : వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో వాహనాలను సీజ్ చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలను సీజ్ చేయవద్దని గతంలోనే హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ పోలీసులు ఇంకా వాహనాల సీజింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వాహనాన్ని సీజ్ చేసిన ఉదంతంపై ఒక బాధితుడు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర హోమ్ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ , రవాణా శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారుల వైఫల్యంపై వివరణ కోరిన హైకోర్టు, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామాలతో చలాన్ల వసూళ్ల పేరుతో వాహనదారులను ఇబ్బంది పెడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.