
Shubman Gill: శతృత్వం కేవలం మైదానంలోనే.. బయట మాత్రం ఆ ఇద్దరి మధ్య ఉన్న బంధం వెలకట్టలేనిది. ఎవరి గురించి చెబుతున్నా అనుకుంటున్నారు. అదేనండి.. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ల మధ్య ఉన్న ‘కింగ్-ప్రిన్స్’ అనుబంధం గురించి చెబుతున్నాను. వీరి అనుబంధం క్రికెట్ లోకానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించిన తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గిల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్సీబీ మోటో అయిన “ప్లే బోల్డ్” (భయం లేకుండా ధైర్యంగా ఆడండి) అని ట్యాగ్లైన్ ఉంచాడు. అంతేకాదు.. కోహ్లీ ఫోటోను గిల్ షేర్ చేయడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.
వాస్తవానికి మైదానంలో ఆట సాగుతున్నప్పుడు గిల్ వికెట్ పడగానే కోహ్లీ తనదైన శైలిలో ఎంతో దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. అలాగే మ్యాచ్ మధ్యలో ఓ వివాదాస్పద క్యాచ్ విషయంలో కోహ్లీ ఫోర్త్ అంపైర్తో వాదించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం గిల్, కోహ్లీలు ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఆ సమయంలోనే కోహ్లీ అంపైర్తో చేసిన వాదన గురించి కూడా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆర్సీబీని సరదాగా ఆటపట్టించిన గిల్, గెలుపు ఉత్సాహంలో ఆ పోస్ట్ పెట్టాడు.
ఇదిలా ఉండగా..మ్యాచ్ అనంతరం గిల్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. మంచి బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ప్రత్యర్థిని 160 పరుగుల లోపే కట్టడి చేసిన బౌలర్లను మనసారా అభినందించాడు. ఫీల్డింగ్లో అక్కడక్కడా తడబడ్డా, ఈ మ్యాచ్లో మాత్రం ప్లేయర్స్ చూపించిన ఎనర్జీ అద్భుతమని మెచ్చుకున్నాడు. తన బ్యాటింగ్ గురించి చెబుతూ.. తాను చాలా ఏకాగ్రతతో (In the zone) ఉన్నానని, ఆ రోజంతా తనకే అనుకూలంగా ఉందనిపించిందని, అందుకే బౌలర్లపై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నట్లు గిల్ తెలిపాడు. చివరలో రాహుల్ తెవాటియా మ్యాచ్ను ఫినిష్ చేయడంపై ప్రశంసలు కురిపిస్తూ, అనుకున్న దానికంటే కొన్ని వికెట్లు ఎక్కువగా కోల్పోయినప్పటికీ అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం రావడం జట్టుకు కలిసొచ్చే అంశమని గిల్ అభిప్రాయపడ్డాడు.