Reading Time: 2 minutes
Tamil Nadu Exit Polls Stalin Reaction Dmk Aiadmk Vijay Tvk

M. K. Stalin: ఎగ్జిట్ పోల్స్ హడావుడి, అంచనాల హోరు మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. ఓటింగ్ ముగిసిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆయన, అంచనాల కంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో పార్టీ చేసిన కష్టాన్నే నమ్ముకున్నట్లు సంకేతాలిచ్చారు. చెన్నైలో జరిగిన మే డే వేడుకల్లో పాల్గొన్న స్టాలిన్, కార్మికుడి శ్రమకు తగ్గ వేతనం దక్కడం ఎలాగైతే వాళ్ల హక్కో, అలాగే తమ కూటమి పడ్డ కష్టానికి మే 4వ తేదీన ఫలితాల రూపంలో తగిన ప్రతిఫలం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని, అయితే తాను ఈ మాటలను ఎగ్జిట్ పోల్స్‌ను చూసి చెప్పడం లేదని, ప్రజల నాడిని, పార్టీ కార్యకర్తల పనితీరును గమనించిన తర్వాతే చెబుతున్నానని స్పష్టం చేశారు. మే డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించిన తన తండ్రి కరుణానిధి వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. అందరికీ అన్నీ అందాలనే తమ ప్రభుత్వ ఫిలాసఫీనే మున్ముందు కూడా కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో కచ్చితంగా శుభవార్త వింటామని కేడర్‌లో ఉత్సాహం నింపారు.

మరోవైపు, తమిళనాడు రాజకీయాల్లో ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఊహించని రీతిలో భిన్నంగా ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఒకరిద్దరు విజేతలను చూపిస్తే, ఇక్కడ మాత్రం ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడిఎంకెతో పాటు కొత్తగా రంగంలోకి దిగిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సైతం రేసులో ఉన్నట్లు వేర్వేరు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘యాక్సిస్ మై ఇండియా’ సర్వే ఏకంగా విజయ్ పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో అధికార డీఎంకే 92 నుంచి 110 సీట్లకు పరిమితం కావొచ్చని, ఏఐఏడిఎంకె కేవలం 22 నుంచి 32 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. దీనికి భిన్నంగా ‘పీపుల్స్ పల్స్’ సర్వే మాత్రం డీఎంకేకు స్పష్టమైన మెజారిటీ (125-145 సీట్లు) కట్టబెడుతుండగా, ఏఐఏడిఎంకెను రెండో స్థానంలో, విజయ్ పార్టీని మూడో స్థానంలో నిలబెట్టింది.

మరోవైపు ‘JVC–టైమ్స్ నౌ’ సర్వే ఏఐఏడిఎంకె ప్రభంజనం సృష్టించబోతోందని, ఆ పార్టీకి 128 నుంచి 147 సీట్లు వస్తాయని బాంబు పేల్చింది. ఇక ‘చాణక్య’ సర్వే ప్రకారం డీఎంకే 125 సీట్లతో మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, టీవీకే 63 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని విశ్లేషించింది. ఈ అయోమయ పరిస్థితుల మధ్య రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడూ తమను తక్కువ చేసి చూపుతాయని, తాము కనీసం 150 సీట్లు గెలుస్తామని ఏఐఏడిఎంకె నేత ఇన్బదురై కొట్టిపారేశారు. అటు టీవీకే ప్రతినిధి నిర్మల్ కుమార్ కూడా గ్రౌండ్ రియాలిటీకి, ఈ అంచనాలకు పొంతన లేదని, ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని చెప్పారు. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందిస్తూ.. తమకు అనుకూలంగా వచ్చిన సర్వేలు చాలా జాగ్రత్తగా (తక్కువగా) వేసిన అంచనాలేనని, అసలు ఫలితాల్లో తాము భారీ మెజారిటీ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.