
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంలో కీలకమైన మార్పులు చేస్తూ ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా సీనియర్ అధికారిణి శిఖా గోయల్కు హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత బాధ్యతలు అప్పగించగా, దేవేంద్ర సింగ్ చౌహాన్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా నియమితులయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా డాక్టర్ తరుణ్ జోషిని ఎంపిక చేశారు. ఈ స్థానంలో ఉన్న సుధీర్ బాబు పదవీ విరమణ చేయడంతో తరుణ్ జోషిని అక్కడ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాష్ మొహంతిని బదిలీ చేసింది. అదేవిధంగా, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి. సుమతిని నియమించగా, మల్టీజోన్-2 ఐజీపీగా షానవాజ్ ఖాసిం బాధ్యతలు చేపట్టనున్నారు. ఐజీపీ కార్తికేయకు తన ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎస్ఐబీ (SIB) ఇంటెలిజెన్స్ అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. రాష్ట్ర పరిపాలనలో వేగం పెంచడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నియామకాలను చేపట్టింది.