
Bengal Repolling: పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్ కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మే 4న ఎవరు గెలుస్తారనే దానిపై క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే, బెంగాల్లో మరోసారి పోలింగ్ జరగబోతోంది. ఇటీవల డైమండ్ హార్బర్, మగ్రాహాట్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్నికల అక్రమాలు జరిగాయని ఫిర్యాదు రావడంతో ఆయా నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రేపు(శనివారం) రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Read Also: TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
మగ్రాహాట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ 15 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఫల్తా నియోజకవర్గంలోని ఫిర్యాదులపై ఎన్నికల సంఘం నివేదిక కోసం ఎదురుచూస్తోంది. ఫల్తా నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఇతర బూతుల్లో పోలింగ్ అవసరమా లేదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందని అధికారులు చెప్పారు. ఇటీవల ఫల్తాలోని కొన్ని సెంటర్లలో ఈవీఎం మెషిన్లపై బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా టేపులు అంటించడం వివాదంగా మారింది.