
రేపు (మే 2న) దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు భయపడడం లేదా కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు అంటే వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం ‘సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.
ఏం జరుగుతుంది?
మీ మొబైల్కు ఒక మెసేజ్ వస్తుంది. దాంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం ఒక ‘టెస్ట్’ మాత్రమే. కాబట్టి ఈ మెసేజ్ లేదా శబ్దం చూసి మీరు ఏమీ చేయక్కర్లేదు. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
దీనివల్ల లాభం ఏంటంటే
*ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సమాచారం చేరుతుంది.
*వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు.
*ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్లు వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మే 2, 2026న మీ ఫోన్లో సైరన్ మోగినా లేదా ఎమర్జెన్సీ అలర్ట్ అని మెసేజ్ వచ్చినా అది ప్రభుత్వం చేస్తున్న చిన్న టెస్టింగ్ అని గమనించండి. అలాగే భయపడకుండా ఇతరులకు కూడా ఈ విషయం తెలియజేయండి. మీ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నా కూడా ఈ సైరన్ వినిపించే అవకాశం ఉంది.