Reading Time: < 1 minute

పెండింగ్ చలాన్ల వాహనం సీజ్ వ్యవహారం.. సీవీఆనంద్, శివధర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు

Caption of Image.

పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల సీజ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్న ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. పెండింగ్ చలాన్లు ఉన్నాయన్న కారణంతో వాహనాలను సీజ్ చేయవద్దని 2026 జనవరి 20న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే  ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన  ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వాహనాలను సీజ్ చేస్తున్నారన్న వాదనను పరిగణనలోకి తీసుకున్న  హైకోర్టు.. హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ట్రాఫిక్ జాయింట్ సీపీ , రవాణా శాఖ కమిషనర్‌లకు నోటీసులు పంపింది.

అంతేకాకుండా వాహనదారులు M-వాలెట్‌లో తమ ఆర్‌సి (RC) చూపిస్తున్నా పోలీసులు అంగీకరించడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది.
 

©️ VIL Media Pvt Ltd.