July 8, 2026

Nishant Kumar: జేడీయూ వారసుడికి పట్టాభిషేకం రేపేనా? బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమారుడు!

Nishant Kumar: జేడీయూ వారసుడికి పట్టాభిషేకం రేపేనా? బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమారుడు!
Reading Time: 2 minutes
Nitish Kumar Rajya Sabha Son Nishant Kumar Jdu Entry Bihar Deputy Cm

Nishant Kumar: బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. జనతాదళ్ (యునైటెడ్) అధినేత, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వారసుడిగా తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయ క్షేత్రంలోకి దింపారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక సమావేశంలో రెండు ప్రధాన నిర్ణయాలకు ఏకగ్రీవ ఆమోదం లభించినట్లు సమాచారం. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి స్వస్తి పలికి, రాజ్యసభకు వెళ్లాలనే ప్రతిపాదనను పార్టీ సభ్యులు ఆమోదించారు. అలాగే నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా జేడీయూలో చేరడం కూడా ఖరారు అయ్యింది.

READ ALSO: AI Effect: ఏఐతో ఉద్యోగాలు కోల్పోయే 10 రంగాలు ఇవే.. జాబితా వెల్లడించిన ఆంత్రోపిక్..

నిశాంత్ కుమార్ రాజకీయ ప్రస్థానం..
బిఐటి మెస్రా నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిశాంత్ కుమార్, ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. అయితే, ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నిశాంత్ కుమార్ శనివారం అధికారికంగా జేడీయూ తీర్థం పుచ్చుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. పార్టీ ఓటు బ్యాంకును (కుర్మి-కోరి) కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. పార్టీలో చేరిన వెంటనే నిశాంత్ కుమార్ బీహార్ అంతటా పర్యటించి ప్రజలతో మమేకం కానున్నారని చెబుతున్నారు.

నితీష్ కుమార్ తప్పుకోవడంతో బీహార్‌లో ఎన్డీయే (NDA) కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నితీష్ కుమార్ స్థానంలో బీజేపీకి చెందిన ఒక నాయకుడు (బహుశా బీసీ లేదా ఈబీసీ వర్గానికి చెందిన వ్యక్తి) ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై నితీష్ కుమార్ ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. రేపు జరగబోయే అధికారిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. “నేను రాజ్యసభకు వెళ్తున్నాను, కానీ మేము బీహార్‌లోనే ఉంటాము. అభివృద్ధి పనులన్నీ కొనసాగుతాయి, మీ అందరినీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను” అని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు కన్నీటి పర్యంతమయ్యారని చెబుతున్నారు.

READ ALSO: Hardik Pandya: గంభీర్‌కు గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్..