Reading Time: 2 minutes
Off The Record About Prathipadu Janasena Politics Three Leaders Compete For Party Incharge Post

Off The Record: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జనసేనలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఖాళీగా ఉన్న నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పదవి కోసం మూడు ముక్కలాట నడుస్తూ….రక్తి కట్టిస్తోంది. ఇంతకు ముందు ఇన్ఛార్జ్‌గా ఉన్న తమ్మయ్య బాబును పార్టీ సస్పెండ్‌ చేసింది, ఇటీవల ఆయన చనిపోయారు కూడా. ఇక ఆశావహులు చేస్తున్న వ్యవహారాలతో ప్రత్తిపాడు గ్లాస్‌లో రచ్చ పెరిగి గందరగోళంగా మారుతోంది. ఒకరికి ముగ్గురు ఆ పదవి కోసం పోటీ పడుతుండగా… పార్టీ సభ్యత్వ నమోదుకు లింక్‌ పెట్టడంతో ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో ఉత్కంఠ రేపుతున్నారు. ఎవరు ఎక్కువ మెంబర్షిప్ చేస్తే దానికి అనుగుణంగా ప్రయారిటీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది జనసేన అధిష్టానం. ఇక అందరికంటే ముందు రేస్‌లో నేనున్నానని అంటున్నారు వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి. ప్రస్తుతం ప్రత్తిపాడు జనసేనలో యాక్టివ్‌గా పని చేస్తున్నారామె. ఆమె సోదరుడు గిరిబాబు ఇదే నియోజకవర్గానికి వైసీపీ కో ఆర్డినేటర్‌. దాంతో జనసేన బాధ్యతలు తనకిస్తే…పొలిటికల్‌ గేమ్‌ బాగుంటుందని, మైలేజ్ కూడా వేరే లెవల్‌ అన్నట్టుగా ఉంటుందని చెబుతున్నారట క్రాంతి. అందుకు అనుగుణంగానే తన నెట్వర్క్‌ను బిల్డప్‌ చేసుకుంటున్నారు క్రాంతి. మరోవైపు స్థానిక నాయకుడు సూర్యకిరణ్ కూడా సభ్యత్వ నమోదులో యాక్టివ్‌గా ఉన్నారు. తమ్మయ్య బాబును పార్టీ సస్పెండ్ చేశాక జనసేన తరఫున నియోజకవర్గంలో లీడ్ తీసుకున్నారు సూర్యకిరణ్‌. టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.

మొదట్నుంచి పార్టీలో ఉన్నానని, ఈసారి తనకే అవకాశం ఉంటుందని గట్టిగానే లెక్కలు వేస్తున్నారాయన. అదే సమయంలో క్రాంతి కూడా ఆయనకు గట్టి కౌంటర్స్‌ వేస్తుండటం ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ అంటే… లోకల్‌గా పార్టీ ఇండివిడ్యువల్‌గా ఎదిగేలా చేయాలి. దానికి బదులు బేస్ లేకుండా, టీడీపీ అడుగులకి మడుగులొత్తేవారివల్ల మనకేంటి ప్రయోజనం అంటూ సెటైర్స్‌ వేస్తున్నారట ముద్రగడ కుమార్తె. పార్టీ మైలేజ్ పెంచాలి గాని, ఎమ్మెల్యే పక్కన సీట్ వేస్తే సరిపోతుందని అనుకుంటే ఉపయోగం ఉండదని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారామె. అటు సూర్య కిరణ్ కూడా ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్లకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ రివర్స్‌ పంచ్‌లు వేస్తుండటంతో ప్రత్తిపాడు జనసేనలో పరిణామాలు ఆసక్తిరంగా మారుతున్నాయి. అసలు క్రాంతి నాన్‌లోకల్, ఆమెకెందుకు అంత ప్రయారిటీ అన్నది సూర్య కిరణ్‌ వాదన. రాజమండ్రి నుంచి ప్రత్తిపాడు వచ్చి రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారట ఆయన. వీళ్లిద్దరి పోరు ఇలా ఉంటే… అటు చనిపోయిన నాయకుడు వరుపుల తమ్మయ్య బాబు కుమారుడు సాయికిరణ్ కూడా రేస్‌లోకి వచ్చారు. పార్టీ కోసం తన తండ్రి చాలా పని చేశారంటూని డైలాగులు చెప్పేస్తున్నారట ఆయన. దాంతో ప్రత్తిపాడు గ్లాసు పార్టీలో పంచాయితీలు రోజురోజుకి పెరుగుతున్నాయి.. ఎవరి పట్టు కోసం వాళ్లు గ్రూపులుగా విడిపోయారు.

ఒకటే పార్టీగానీ.. మూడు వర్గాలు అన్నట్టు తయారైంది. దీంతో ఎవరివైపు మొగ్గితే ఏం తంటా వస్తుందోనని జన సైనికులు సైతం సైలెంట్‌గా సైడ్ అయిపోతున్నారట. ముగ్గురిలో ముద్రగడ కుమార్తె మాత్రం పార్టీ పెద్దల దగ్గర గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్‌. సూర్య కిరణ్‌కు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సపోర్ట్ ఉందట. సాయి కిరణ్ మాత్రం తండ్రి సెంటిమెంట్ తో వర్క్ అవుట్ చేస్తున్నారు. అదే సమయంలో ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ లెక్కలు కూడా వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. క్రాంతి అయితే ఇండివిడ్యువల్‌గా చేసుకుంటారని, నియోజకవర్గంలో తనను ఇన్వాల్వ్ అవనివ్వరన్న ఉద్దేశ్యం ఆయనకు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా రకరకాల కేలిక్యులేషన్స్‌తో ఎవరికి వారు బల ప్రదర్శనకు సిద్ధమవుతుండటంతో లోకల్‌ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో గందరగోళం పెరిగిపోతోంది. పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని ఈ మూడు ముక్కలాటకు ఎండ్‌ కార్డ్‌ వేయాలని కోరుతున్నారు.