Reading Time: 2 minutes
Hyderabad: కిడ్నీ క్యాన్సర్‌ మహిళకు అరుదైన సర్జరీ.. పునర్జన్మ ఇచ్చిన గాంధీ ఆసుపత్రి డాక్టర్లు

హైదరాబాద్‌, జనవరి 24: ఓ 41 ఏళ్ల మహిళ కేవలం స్వల్ప కడుపు నొప్పితో గాంధీ ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక స్కానింగ్‌లో కిడ్నీలో పెద్ద కణితి ఉన్నట్లు తేలింది. యూరాలజీ విభాగంలో చేర్చుకుని సి.ఇ.సి.టి (CECT), ఎం.ఆర్.ఐ (MRI) మరియు డాప్లర్ పరీక్షలు నిర్వహించగా, ఆ కణితి కేవలం కిడ్నీకే పరిమితం కాకుండా, శరీరంలోని ప్రధాన రక్తనాళమైన IVC (Inferior Vena Cava) లోపలికి కణితి వ్యాపించిందని (Tumor Thrombus) వైద్యులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ స్థితి. ఈ సర్జరీలో ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణాపాయం ఉంటుందని తెలిసినా, రోగి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా యూరాలజీ బృందం నేతృత్వంలో నిపుణులు రంగంలోకి దిగారు.

క్యాన్సర్ బారినపడిన కుడి కిడ్నీని పూర్తిగా తొలగించడంతో పాటు (Right Radical Nephrectomy), ప్రధాన రక్తనాళం (IVC) లోపల ఉన్న కణితిని (Thrombus) విజయవంతంగా తొలగించారు (IVC Thrombectomy). అనంతరం ఆ రక్తనాళాన్ని తిరిగి పునరుద్ధరించారు (IVC Repair). ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్య బృందం యూరాలజీ విభాగం HOD డాక్టర్ జి. రవిచందర్ మాట్లాడుతూ ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో అదీ ఉచితంగా ఇంతటి క్లిష్టమైన వైద్యం అందించినందుకు రోగి కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రి వైద్యులకు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ జి రవిచందర్ మాట్లాడుతూ.. ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడానికి నిరంతరం సహకారం అందించిన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, సివిల్ సర్జన్ RMO డాక్టర్ శేషాద్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ మధుసూదన్ సేవలను ప్రశంసిస్తూ.. ఈ కేసు కోసం ఉస్మానియా ఆసుపత్రి నుండి ప్రత్యేకంగా వచ్చి, తన అమూల్యమైన నైపుణ్యంతో సహకరించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ & లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ కృషి అభినందనీయం అని ఆయన రాక శస్త్రచికిత్స విజయవంతం కావడంలో ఎంతో కీలకంగా నిలిచింది అని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఈ ఆపరేషన్ సమయంలో సి.టి.వి.ఎస్ (కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ) విభాగం, అనస్థీషియా విభాగం అందించిన సహకారం మరువలేనిది అని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ (Surgical Gastroenterologist & Liver Transplant Surgeon, ఉస్మానియా ఆసుపత్రి), RMO డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, యూరాలజీ వైద్య బృందం HOD డాక్టర్ రవి చందర్, డాక్టర్ రవి జహాగిరిధర్, డాక్టర్ వినయ్, డాక్టర్ శాంతి , డాక్టర్ మధుసూదన్, డాక్టర్ రవీందర్, డాక్టర్ త్రిభువన్, డాక్టర్ మురళీ, డాక్టర్ కిరణ్ మాదాల, డాక్టర్ చంద్రకళ డాక్టర్ కిరణ్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.