Reading Time: < 1 minute
Zptc Members Salary Dues Andhra Pradesh High Court

High Court: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ జడ్పీటీసీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లాకు చెందిన 27 మంది జడ్పీటీసీ సభ్యులు తమకు చెల్లించాల్సిన గౌరవ వేతనం, టీఏ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ముత్యాల చెన్నయ్య సహా 27 మంది జడ్పీటీసీలు కలిసి దాఖలు చేశారు. పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత 35 నెలలుగా ఒక్కో సభ్యుడికి సుమారు రూ.2 లక్షల 10 వేల వరకు బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించాలంటూ గత ఆగస్టులో ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని పిటిషనర్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ఇతర ప్రజాప్రతినిధులకు మాత్రం సకాలంలో వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం, జడ్పీటీసీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 14, 21లకు విరుద్ధమని పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. తక్షణమే తమ వేతన బకాయిలను చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని వారు హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.

READ MORE: Off The Record: “రెండు కళ్ల సిద్ధాంతం”.. పవన్‌ విషయంలో పార్టీ నేతలు, ఫ్యాన్స్ అంచనాలు తప్పుతున్నాయా?