Reading Time: < 1 minute
RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే వార్త.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 22,000 గ్రూప్‌ డి లెవల్ 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన షార్ట్‌ నోటీస్‌లో వెల్లడించింది. ఇందులో ట్రాక్ మెయింటైనర్ (గ్రేడ్ 4), పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్, లోకో షెడ్, ఎస్‌&టీ తదితర విభాగాల్లో అసిస్టెంట్ పోస్టు్లు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18 వేల నుంచి బేసిక్ జీతంతోపాటు ఇతర రైల్వే అలవెన్సులు చెల్లిస్తారు. పదో తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా జనవరి 21, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన వివరాలు ఇలా..

అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026వ తేదీ నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉంటుంది. విద్యార్హతలు, ఎంపిక విధానం, అప్లికేషన్‌ ఫీజు వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అందులో తెలుసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. అంటే అభ్యర్థులు తమ ఆధార్ కార్డు వివరాలను దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా నమోదు చేయవల్సి ఉంటుంది. ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, ఫొటో 10వ తరగతి సర్టిఫికేట్‌తో సరిపోయేలా ఉండాలి. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.