Reading Time: 2 minutes

చిన్నస్వామిలో సాయి సుదర్శన్ విధ్వంసం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

Caption of Image.

RCB vs GT: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్లు శివాలెత్తారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ సాయి సుదర్శన్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో, నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆర్సీబీ బౌలర్లను ఏమాత్రం లెక్క చేయకుండా గ్రౌండ్ నలుమూలల బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. (12.4 ఓవర్లో) సుయాష్ శర్మ బౌలింగ్‌లో గిల్ అవుట్ అయినప్పటికీ, సుదర్శన్ తన జోరును కొనసాగించాడు.

సాయి క్లాసీ సెంచరీ.. హోల్డర్ మాస్ బ్యాటింగ్: 
సాయి సుదర్శన్ కేవలం 57 బంతుల్లోనే తన చిరస్మరణీయ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శతకం బాదిన వెంటనే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగినప్పటికీ, అప్పటికే గుజరాత్ పటిష్ట స్థితికి చేరుకుంది. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (16 బంతుల్లో 25) మెరుపులు మెరిపించి భువనేశ్వర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లలో వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్ పరుగులు చేయడానికి కొంత తడబడినట్లు అనిపించినా.. కృనాల్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో జేసన్ హోల్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 18 పరుగులు పిండుకోవడంతో గుజరాత్ స్కోరు 200 మార్కును దాటింది.

►ALSO READ | FIFA World Cup: ఒక్కో టిక్కెట్ రూ. 21 కోట్లు! : వరల్డ్ కప్ ఫైనల్ చూడాలంటే కోట్లు కావాలి భయ్యా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లు పరుగులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ తల ఒక వికెట్ తీసుకోగా. మిగతా బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆర్సీబీ విజయ లక్ష్యం 206 పరుగులు. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్‌లతో కూడిన బెంగళూరు బ్యాటింగ్ లైనప్ ఈ భారీ స్కోరును ఎలా ఛేజ్ చేస్తుందో చూడాలి.   

©️ VIL Media Pvt Ltd.