Petrol Price Hike: మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధరలు!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ దేశాలు ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇంకా తగ్గని శ్రీలంకలో ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలను పెంచడం అక్కడి ప్రజలకు మరింత భారంగా మారింది. శ్రీలంక ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు గణనీయంగా పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరగనున్నాయి. దీంతో రోజువారీ జీవన వ్యయం మరింత భారమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా పెంపుతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర లీటర్కు రూ.81 పెరిగి.. రూ.398కు చేరింది. అలాగే ఆక్టేన్ 95 పెట్రోల్ ధర రూ.90 పెరిగి.. లీటర్కు రూ.455గా నమోదైంది. డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆటో డీజిల్ లీటర్కు రూ.79 పెరిగి రూ.382కు చేరగా.. సూపర్ డీజిల్ రూ.90 పెరిగి లీటర్కు రూ.443గా మారింది. కిరోసిన్ ధర కూడా రూ.60 పెరిగి లీటర్కు రూ.255కు చేరింది. ఇంధన ధరల ఈ వరుస పెంపులతో శ్రీలంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.