Reading Time: < 1 minute
Jana Sena Introduces Nri Membership To Expand Global Support

Janasena Udyami Membership: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా కొనసాగుతోంది.. మరింత టార్గెట్‌ పెట్టుకుని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సైతం రద్దు చేసింది అధిష్టానం.. ఇక, జనసేన పార్టీ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ‘ఎన్ఆర్ఐ ఉద్యమీ మెంబర్షిప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను పార్టీలోకి ఆహ్వానిస్తూ జనసేన నాయకత్వం పిలుపునిచ్చింది. పార్టీ బలోపేతానికి ఎన్నారైల భాగస్వామ్యం కీలకమని భావిస్తున్న నాయకత్వం, వారి సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తోంది.

ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్లోబల్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ప్రత్యేక సభ్యత్వం ప్రారంభించబడినట్లు నాయకులు పేర్కొన్నారు. విదేశాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా జనసేన నాయకత్వం వెల్లడించింది. ఈ చర్యతో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల మద్దతు మరింతగా పెరుగుతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.