Reading Time: < 1 minute
Hyderabad Retired Judge Loses Rs 1 66 Crore In Digital Arrest Cyber Fraud

Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌ల పేరిట అమాయకులను ముంచేస్తున్నారు. చదువుకున్న వ్యక్తులు సైతం ఈ డిజిటల్ అరెస్ట్‌లకు బలవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. సైబర్ కేటుగాళ్లు ఈ సారి ఏకంగా రిటైర్డ్ జడ్జీని టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా దోచేశారు. సైబర్ మోసగాళ్లు వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని చెప్పి రిటైర్డ్ జడ్జిని భయపెట్టారు. మీపై విచారణ జరుగుతోందని, కేసు ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తూ డిజిటల్ అరెస్ట్ చేసినట్టు నటించారు. అంతేకాకుండా మీ ఆధార్‌కు లింక్ అయిన రెండు మొబైల్ నెంబర్లు మహిళలకు అభ్యంతరకర కాల్స్ చేస్తున్నాయని చెబుతూ మాజీ జడ్జిని భయభ్రాంతులకు గురిచేశారు.

READ MORE: Pakistan Cricket: “అభినందనలు”.. టీమిండియా హ్యాట్రిక్ విజయంపై పాకిస్థాన్ షాకింగ్ రియాక్షన్..

అదే సమయంలో ఇందిరానగర్లో మీపై కేసు నమోదు అయిందని చెప్పి మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. మీపై మానవ అక్రమ రవాణా కేసు కూడా నమోదైందని, దీనిపై సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని కాల్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ విషయాల గురించి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడకూడదని కూడా హెచ్చరించారు. దర్యాప్తు కోసం మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి, మీరు చెల్లించే మొత్తం విచారణ పూర్తయ్యాక తిరిగి ఇస్తామని నమ్మబలికారు. అరెస్టు అయితే ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందనే భయంతో రిటైర్డ్ జడ్జి మొత్తంగా రూ.1.66 కోట్లు సైబర్ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. అయితే మోసగాళ్లు చెప్పినట్లుగా నగదు తిరిగి ఇవ్వకపోవడంతో మోసం జరిగినట్టు గ్రహించిన రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించారు.