Reading Time: < 1 minute
Telangana Airports Mamunur Adilabad Airport Development

తెలంగాణలోని ఆదిలాబాద్, మామునూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రితో బుధవారం సమావేశమైన సీఎం, మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎంఆర్‌ఓ వసతులు

ఆదిలాబాద్ విమానాశ్రయంలో ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లతో పాటు ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) సదుపాయాలను కూడా కల్పించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అక్కడ రన్‌వేను ఖరారు చేసేందుకు గాను రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో వెంటనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి, మామునూరు ఎయిర్‌పోర్టుకు సంబంధించి రెండు వారాల్లో టెండర్లు పిలిచి, డిసెంబరు నాటికి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే డిసెంబరులోనే పనులకు శంకుస్థాపన కూడా చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.

హెలీ టూరిజం, సీ ప్లేన్ ల్యాండింగ్

రాష్ట్రంలో ఛాపర్ల (హెలికాప్టర్లు) ద్వారా ‘హెలీ టూరిజం’ను ప్రోత్సహించాలని, దీనివల్ల తెలంగాణ పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాగా, హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలపై రూపొందించిన అధ్యయన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం. అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, సీఎస్ సంజయ్ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.