
Konda Surkha : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమను రెచ్చగొట్టినందుకే తన కూతురు సీఎంపై విమర్శలు చేసిందని, మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెబుతున్నారని గుర్తుచేశారు. తన కూతురు మాట్లాడిన మాటలకు తనపై చర్యలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేసిన సురేఖ, ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీసుకోవాలని సంచలన డిమాండ్ చేశారు. ‘పదేళ్ల పాటు నేనే సీఎం’ అని రేవంత్ రెడ్డి ప్రకటనలు చేయడం పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకురాదా అని ఆమె నిలదీశారు.
తదుపరి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందనేది నిర్ణయించడానికి సీఎంకు ఏం హక్కు ఉందని సురేఖ ప్రశ్నించారు. బహిరంగ వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల పేర్లను ఎలా ప్రకటిస్తారని, దానికి ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారని నిలదీశారు. అధిష్టానం నిర్ణయించాల్సిన టికెట్ల వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ముందే తేల్చడం వల్లనే సమస్యలు వస్తున్నాయని, ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే తన కూతురు స్పందించాల్సి వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విమర్శలు, సీఎం ఏకపక్ష నిర్ణయాలపై ఢిల్లీ వేదికగా కొండా సురేఖ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయంలో కాకరేపుతున్నాయి.